Friday, October 24, 2014

కార్తిక మాస మహాత్మ్యం...ద్వితీయాధ్యాయం - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సౌజన్యం తో !

కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం

అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు.  మిత్రశర్మ ఆమెయందు మిక్కిలి ప్రేమకలవాడై   ఆమెయందనురాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె ప్రియుడు  ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి  స్వేచ్చగా సంచరించుచుండెను, నీతి తప్పి చరించువారితో నీతి తప్పి ప్రవర్తించు చుండెను.  నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. ఈ విధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము. ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః

No comments:

Post a Comment

Total Pageviews